
గోల్కొండ/చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బోనాల నిర్వహణ ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు గోల్కొండ చౌరస్తా వద్ద ఘటాలకు స్వాగతం పలికారు. కాగా.. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాల్లో భాగంగా జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించారు.
ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, గాజుల అంజయ్య, రాకేష్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్, జనగామ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.