జనగామ: పిల్లలు చిన్నచిన్న కారణాలతో బడికి డుమ్మా కొట్టడం సాధారణం. అలాంటిది జనగామ జిల్లా నర్మెట మండలం మాన్సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారి కె.రితిక వరుసగా రెండో విద్యా సంవత్సరంలో ఒక్క రోజూ పాఠశాలకు మిస్ కాకుండా హాజరై రికార్డు నెలకొల్పింది. 3వ తరగతిలో 2024– 25 విద్యాసంవత్సరంలో వందశాతం హాజరు సాధించిన రితిక, ప్రస్తుతం 4వ తరగతిలో 2025–26 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ఇప్పటివరకు ఒక్కరోజూ కూడా బడికి మిస్ కాకుండా హాజరైంది. దీంతో రితికకు సోమవారం పాఠశాల సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు.
తోవ లేక తోటలో నుంచి..
వెంకటాపురం (కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల పరిధి లోని వెంగళరావు పేట గ్రామస్తులు శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారిలేక అవస్థలు పడుతున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోతే దహన సంస్కారాల నిమిత్తం శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి లేదు. దీంతో ఐదు కిలో మీటర్ల దూరం మేర మిర్చి తోటల మధ్యలో నుంచి తీసుకెళ్లారు. దారి కోసం రెండేళ్ల నుంచి విన్నవించుకుంటున్నా అధికా రులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


