బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
జనగామ రూరల్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కోప్ స్వచ్ఛంద సంస్థ (సొసైటీ ఫర్ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్) సంస్థల సహకారంతో ‘బాల్య వివాహ ముక్తభారత్’ ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్న సుమారు 50 గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాలు ఆస్పత్రి పరిసరాల్లో ప్రజలకు బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఇతర చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ (1098)పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలనలో ప్రభుత్వం–స్వచ్ఛంద సంస్థలు–సమాజం కలిసి పని చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారి కుమారస్వామి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, ప్రతినిధి మనోజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు సంపత్, రాజు, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శేఖర్, సఖి సెంటర్ నిర్వాహకురాలు రేణుక, శారద, సుధ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా


