ఈ చిరునవ్వులిక కానరావు | four Year Boy tragically drowned after falling into water sump | Sakshi
Sakshi News home page

ఈ చిరునవ్వులిక కానరావు

Jul 13 2025 11:28 AM | Updated on Jul 13 2025 11:28 AM

four Year Boy tragically drowned after falling into water sump

సంప్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

హైదరాబాద్: ఇంటి ఆవరణలోని సంప్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్వర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిలాఘన్‌పూర్‌ మండలానికి చెందిన సభావత్‌ శ్రీను, నీల దంపతులకు ఓ కూతురు అఖిల, కుమారుడు అభి (4) ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం వలస వచ్చి నగరంలో మియాపూర్‌ హఫీజ్‌పేట్‌ సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా సెంట్రింగ్‌ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. 

బాలుడు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీను, నీల దంపతులు కూలిపనుల నిమిత్తం వెళ్లగా కూతురు అఖిల, కుమారుడు అభి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు అభి ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నుంచి నీటిని తీసుకునేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమీపంలో ఆడుకుంటూ ఉన్న అఖిల చూసి   స్థానికులకు చెప్పడంతో అభిని సంపులోంచి బయటకు తీసి సమీపంలోని  కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. 

సంపుపై మూత ఏర్పాటు చేయా లని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పి నా పట్టించుకోలేదని.. దీంతో తమ కుమారుడు మృత్యువాత పడినట్లు అభి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మియాపూర్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement