సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. రూ.9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులో గుర్తించారు. ఏడుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా, నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు.
హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది.
హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు.


