సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆదివారం ఈ విషయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన చేశారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి జూపల్లి అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు. నిజామాబాద్లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేయడంతో సౌమ్య గాయడి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది.
మోస్రా కన్నీరు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోస్రా గ్రామానికి సౌమ్య మృతదేహం చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది భారీగా తరలి వచ్చి నివాళులర్పించారు.


