సాక్షి హైదరాబాద్: తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 9 సంస్థల్లో ఆహార ఉత్పత్తులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. మరో 5 సంస్థలకు పరిస్థితులను మెరుగుపరచుకోవాలని నోటీసులు అందించారు. మొత్తం 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఉన్న 20 ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు.
కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కలుషిత మాంసం, పురుగులు పట్టిన ముడి సరుకులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన వంటశాలలు, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ముడి సరుకులు లభించాయి. ఆహార తయారీదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారించారు.
హోటల్ సంగీత్ గ్రాండ్, బహార్ బిర్యానీ కేఫ్, బాలాజీ ఫేని, అండ్ నమ్కిన్, భువనేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీ, హోటల్ సింధూర ఈస్ట్ కోర్ట్, కెమెస్ట్రీ బార్ అండ్ కిచెన్ (సురభి గ్రాండ్), న్యూ లిమ్రా హోటల్, ఎన్ విలేజ్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చంపాపేట్, కినరా గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్. వనస్థలిపురం సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వివరించారు. రామకృష్ణ ఆయిల్ మిల్, గ్రీన్ల్యాండ్ దాబా, కెఫీ కేఫ్, వన్ లాంజ్ బార్ అండ్ కిచెన్లకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అన్టెరా–నాగోల్, హోటల్ సారథి గ్రాండ్, లక్కీ రెస్టారెంట్–నాగోల్, విజయ రాఘవేంద్ర హోటల్, భగవతి మిస్తాన్ భండార్, ది జాయింట్ అల్ మండీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి: KBR Park: ఇక అదే దారి


