
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్రావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం, ఏసీబీ అధికారులు.. మురళీధర్ రావును న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో మురళీధర్ రావుకు న్యాయమూర్తి .. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో, ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా.. నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలలో 6,500గజాల స్థలం గుర్తించారు.
కొండాపూర్లో విల్లా.. బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో బిజినెస్, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది.