ఉద్యోగుల్లో 64 శాతం మంది ఆహారపు అలవాటు ఇదే
సాక్షి, హైదరాబాద్: మారిన జీవనశైలి, సుదీర్ఘమైన ప్రయాణాలు, ఆలస్యంగా తినే భోజనం నగర వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ ఉద్యోగుల్లో ఏకంగా 64 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాతే భోజనం (డిన్నర్) చేస్తున్నారని ఈవా ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026 నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే మొదటి టచ్ బేస్డ్ మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ రూపొందించిన ఈ నివేదిక దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షలకు పైగా రీడింగ్ల ఆధారంగా రూపొందింది.
శరీర విశ్రాంతికి విఘాతం..
రాత్రిపూట ఆలస్యంగా, అతిగా భోజనం చేయడం, ఒత్తిడి, నిద్రకు ముందు కాఫీ తాగడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతోంది. మరుసటి రోజు ఉదయానికి శరీరం అలసటగా ఉండే ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ ఎదురవుతోందని నివేదికలో వెల్లడించింది. ఉదయం పూట మధుమేహం స్థాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు నిద్ర నాణ్యత పడిపోతోందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 40 శాతం మంది నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడంతో గుండె స్పందన రేటు పెరుగుతోందని వెల్లడించింది.
ఇతర నగరాల్లోనూ..
ముంబైలో 64 శాతం మంది రాత్రి 9.30 గంటల తర్వాతే తింటున్నారు. లోకల్ రైళ్ల ప్రయాణాలు వారిలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. బెంగళూరులో 44 శాతం మందికి సుదీర్ఘమైన ట్రాఫిక్ ప్రయాణాలతో రోజువారీ శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. ఢిల్లీ– ఎన్సీఆర్లో చలికాలపు పొగమంచుతో 30 శాతం మంది బయటకు రాకపోవడంతో వెల్నెస్ స్కోర్లు తగ్గుముఖం పట్టాయి.
ఇలా చేస్తే మేలు..
చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్య స్కోర్ను 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుకోవచ్చని ఈ అధ్యయనం సూచించింది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిచే వారిలో షుగర్ లెవల్స్ 12–16 శాతం వరకు నియంత్రణలోకి వస్తున్నాయి. రాత్రి డిన్నర్ను వీలైనంత త్వరగా ముగించడం, కేఫిన్ (కాఫీ) తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు.


