దుబ్బాక ఉప ఎన్నిక : మొత్తం పోలింగ్‌ 82.6 శాతం

Dubbaka Byelection Polling Ends - Sakshi

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా  ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల  తర్వాత కూడా క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఉప ఎన్నికలో మొత్తం 82.61 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. కాగా దుబ్బాక ఉప ఎన‍్నిక ఫలితం నవంబర్‌ 10న వెలువడనుంది. ​కాగా సాయంత్రం చూసుకుంటే 81.14 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్‌ బాధితులకు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్‌ ‌ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. దీంతో పోలింగ్‌ శాతం మరోసారి 85శాతంకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది.

హరీష్‌రావు సమీక్ష
దుబ్బాకలో పోలింగ్‌ సరళిని సిద్దిపేట తన నివాసం నుంచి మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి వివిధ మండలాల ఇంచార్జ్‌లు ఆయనతో పాటు ఉన్నారు. కాగా, తొగుట మండలం వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

చేగుంటలో దొంగ ఓటు..
చేగుంటలో దొంగ ఓటు నమోదయ్యింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇచ్చారు.


పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌..
లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు.


ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు..
తాను పార్టీ మారుతున్నట్లుగా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తున్న టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తోగుట మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో  బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్క్,గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేస్తున్నారు. దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు.


ఓటు వేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్‌ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. 148 గ్రామాల్లో 315 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్‌ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top