
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన అండ్రాసి తిరుమల వారం క్రితం ప్రసవం కోసం కమలాపూర్ సీహెచ్సీకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆతర్వాత ఓ బ్యాండేజ్ క్లాత్ బయటకు తీయకుండా వదిలేశారు. దీంతో తిరుమలకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి.
వెంటనే కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వైద్యుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి ఆ బ్యాండేజ్ క్లాత్ను తొలగించారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వస్తే ఫోన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచిపోయారని బంధువులు చెబుతున్నారు. కాగా.. ప్రభుత్వాస్పత్రులపై నమ్మకంతో వస్తే వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పరిస్థితి విషమించి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాలింత బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
