
కూలిన పాఠశాల భవనం
ఇద్దరు చిన్నారులకు తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
కుభీర్: పాఠశాల భవనం ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులపై పైకప్పు కూలి ఇద్దరికి తీవ్రంగా.. మరో ఇద్దరికి స్వల్పంగా గాయాల య్యాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన బాలబాలికలు.. వేసవి సెలవులు కావడంతో రోజూ ఈ పాఠశాల భవనం నీడలో ఆడుకుంటున్నారు. భవనం ఆవరణలో శుక్రవారం ఆడుకుంటుండగా, ఒక్క సారిగా పాఠశాల పైకప్పు ఒకవైపు కూలిపోయింది. పిల్లలు పరుగులు తీయడంతో.. కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
అక్కడే ఉన్న యువకులు వారిని రక్షించారు. ఈ ఘటనలో సాయికుమార్ (7), ప్రేమ్కుమార్ (7)కు తీవ్ర గాయా లయ్యాయి. తలకు గాయమైన ప్రేమ్కుమార్ను భైంసా ఏరియా ఆస్పపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. కాలు విరిగిన సాయికుమార్కు భైంసా ఏరియా ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
మరో ఇద్దరు చిన్నారులు ప్రణయ్ (6), అభినయ్ (6)లకు స్వల్ప గాయాలయ్యాయి. సాయి కుమార్, లక్ష్మణచాంద మండలం నుంచి వేసవి సెలవుల్లో అమ్మమ్మ గ్రామమైన అంతర్నికి వచ్చి ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటనపై ఎంఈవో విజయ్ కుమార్ను వివరణ కోరగా.. పాఠశాల పాత భవనం కావడంతో కూలిపోయిందని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుభాష్ మాట్లాడుతూ.. ఉదయం బడిబాట కార్యక్రమం అనంతరం భవనం కూలిపోయిందని చెప్పారు. ఈ భవనాన్ని కూల్చివేయాలని గతంలోనే డీఈవోకు లేఖ రాసినట్లు చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక భవనం కూలి ఉంటే.. ఘోరం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.