సరైన వర్షాలు లేకపోతే దోమల గుడ్లు, లార్వాలు పెరిగే అవకాశం
12 ఏళ్ల గణాంకాలతో అధ్యయనం చేసిన పుణే ఐఐటీఎం శాస్త్రవేత్తలు..
వాతావరణ పరిస్థితుల ఆధారంగా హెచ్చరిక వ్యవస్థ అభివృద్ధి చేసిన పరిశోధకులు
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాకాలంలో ఎక్కువ విరామాలు ఉండటం డెంగీ వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సరైన వర్షాలు కురవకపోతే డెంగీ జ్వరంకారక ఏడిస్ ఈజిప్టి దోమల గుడ్లు, లార్వాలు నాశనం కాకుండా ఎక్కువకాలం జీవించి, వర్షాలు మొదలయ్యాక భారీ స్థాయిలో దోమలుగా మారే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డెంగీ ముప్పును రెండు నెలల ముందే గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి.
12 ఏళ్ల డేటాతో అధ్యయనం
ఈ పరిశోధనకు ఐఐటీఎం శాస్త్రవేత్త డాక్టర్ రోహిత్ మాథ్యూ కోల్ కరస్పాండింగ్ రచయితగా, సోఫియా యాకోబ్ తొలి రచయితగా వ్యవహరించారు. 2004 నుంచి 2015 వరకు పుణేలో నమోదైన డెంగీ మరణాల వివరాలను, అదే కాలానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) వంటి వాతావరణ సమాచారాన్ని విశ్లేషించారు. సాధారణ గణాంక పద్ధతులతోపాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి వాతావరణ పరిస్థితులు డెంగీపై చూపే ప్రభావాన్ని అంచనా వేశారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన 2 నుంచి 5 నెలల తర్వాత డెంగీ మరణాలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
ఎల్నినోతో పెరిగే ముప్పు
వర్షాకాలమంతా మోస్తరు వర్షాలు కురిసిన సంవత్సరాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఒక వారంలో 15 సెం.మీ.కుపైగా భారీ వర్షాలు కురిస్తే దోమల గుడ్లు, లార్వాలు కొట్టుకుపోవడంతో వ్యాప్తి తగ్గింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గినప్పుడు ఈ గుడ్లు, లార్వాలు సురక్షితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలాగే 27 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రత, 60–78 శాతం సాపేక్ష తేమ ఉన్నప్పుడు ఏడిస్ దోమలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గుర్తించారు. ఈ దోమల గుడ్లు పొడి వాతావరణంలో 8 నెలల వరకు జీవించగలవని కూడా అధ్యయనం పేర్కొంది.
రెండు నెలల ముందే హెచ్చరిక
సగటు ఉష్ణోగ్రత, మొత్తం వర్షపాతం, సాపేక్ష తేమ వంటి వాతావరణ సూచీల ఆధారంగా రూపొందించిన ఏఐ–మెషీన్ లెర్నింగ్ మోడల్ డెంగీ ముప్పును సుమారు 2 నెలల ముందే అంచనా వేయగలదని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ఆరోగ్య శాఖలు ముందుగానే ఫాగింగ్, లార్వా నిర్మూలన, పారిశుద్ధ్య చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు డెంగీ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


