సాక్షి, నల్లగొండ జిల్లా: హైడ్రా రాష్ట్రవ్యాప్త విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని.. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.
‘‘కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టాం. ఇప్పుడున్న దరఖాస్తులను పరిష్కరించడమే ముందు ప్రాధాన్యత. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. కబ్జా విషయంలో హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.
కబ్జా కోరల నుంచి 2100 భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మరో సంవత్సర కాలంలో లక్ష కోట్లు విలువ చేసే భూములను హైడ్రా కాపాడుతుంది. హైడ్రా పరిధిలోనే 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం’’ అని రంగనాథ్ చెప్పారు.


