
ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి మేం వారితో కొట్లాడాలి.. ఎన్నికలయ్యాక ఆ పార్టీతో దోస్తానా ఎందుకు?
జిల్లా మంత్రి పట్టించుకోరు.. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు
మీనాక్షి నటరాజన్కు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మొర
మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారని పాలమూరు ఎమ్మెల్యేల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం విషయంలో పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కోరారు. ఎన్నికల సమయంలో తాము ఎంఐఎంతో ప్రాణాలకు తెగించి కొట్లాడతామని, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆ పార్టీతో దోస్తానా చేస్తారని, ఇలాగైతే హైదరాబాదులో పార్టీ ఎలా అభివృద్ధి అవుతుందని వారు ప్రశ్నించారు. ఎంఐఎం విషయంలో ఒక వైఖరి తీసుకుని ముందుకెళ్తే తాము కూడా రాజకీయంగా ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్న మీనాక్షి నటరాజన్ రెండో రోజు గురువారం మహబూబ్నగర్, చేవెళ్ల, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలు ఎంఐఎం అంశాన్ని ఆమె వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.
జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు.
’హైదరాబాద్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకుడికి కూడా నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. ఎంఐఎంతో కొట్లాడినప్పుడు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేయాలని కోరినా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఇన్చార్జి మంత్రి మమ్మల్ని కలవరు. సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు’ అని మీనాక్షి నటరాజన్ వద్ద హైదరాబాద్ నేతలు మొరపెట్టుకున్నట్టు తెలిసింది.
వారి విజ్ఞాపనలు విన్న మీనాక్షి అన్ని అంశాలు పార్టీతో మాట్లాడతానని, హైదరాబాద్ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్దామని చెప్పినట్లు తెలిసింది. చేవెళ్ల, మహబూబ్గర్ లోక్సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా మీనాక్షితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత గురించి వారితో మాట్లాడినట్టు తెలిసింది.
పాలమూరు లోక్సభ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రులు తమ నియోజకవర్గాలకు అధిక నిధులు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తమకు నష్టం జరుగుతోందని, మంత్రులతో సమానంగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల కూడా నిధులిచ్చేలా చూడాలని మీనాక్షిని కోరినట్లు తెలిసింది.