Nalgonda Congress Leader Palle Ravi Kumar Joins In TRS Party, Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. గులాబీ గూటికి పల్లె రవికుమార్‌ దంపతులు

Oct 15 2022 3:25 PM | Updated on Oct 15 2022 4:56 PM

Congress Leader Palle Ravi Kumar Joins TRS In the presence of KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్‌, ఆయన సతీమణి శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు భేటీ అయ్యారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. 

ఈ సందర్భంగా పల్లె రవికుమార్‌ దంపతులకు మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మునుగోడు ఉప​ ఎన్నికలో పల్లె రవి కుమార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించడంతో పల్లె రవికుమార్‌ తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. 

ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌  తెలిపారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని భరోసానిచ్చారు. 
చదవండి: కేసీఆర్‌ టార్గెట్‌పై టీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌.. కంటి మీద కునుకులేదు?

చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కు తెలియజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పల్లె రవికుమార్‌ తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషిని చేస్తామని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement