
ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ కసరత్తు
సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలపై దృష్టి
ఖాళీగా చీఫ్ విప్ పదవి.. ఇటీవల రెండు విప్లూ ఖాళీ
చీఫ్ విప్గా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం..లేదంటే బీసీ విప్లకు ప్రమోషన్?
విప్ల కోసం పరిశీలనలో సామాజిక వర్గానికి రెండు పేర్లు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్ల బదిలీలు, జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అసెంబ్లీ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశముందని, ఒకవేళ మండలిలో అదే సామాజిక వర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఉందని సీఎం భావించిన పక్షంలో బీసీ నేతకు కేటాయించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఇక మొన్నటివరకు విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మంత్రిగా, మరో విప్ రాంచంద్రు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను కూడా భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సమీకరణలను బట్టి విప్ల సంఖ్యను 4 నుంచి 5 లేదా 6కు పెంచే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం.
చీఫ్ విప్ ఎవరికి?
ప్రస్తుతం అసెంబ్లీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ వర్గాలకు చెందిన రాంచంద్రునాయక్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు బీసీలు.. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య, మున్నూరుకాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్లు విప్లుగా ఉన్నారు. మరో రెండు విప్ పదవులు (అడ్లూరి, రాంచంద్రు నాయక్) ఇటీవల ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు చీఫ్ విప్ను నియమించకపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇలావుండగా ఇప్పటివరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ పోస్టులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆ వర్గం నేతలకు చాన్స్ దక్కలేదు.
ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డికి కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానిపక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి నియామకం ద్వారా అటు సామాజిక సమీకరణలను పాటించడంతో పాటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శకు కొంతవరకు చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకపోతే మాత్రం ప్రస్తుతం విప్లుగా ఉన్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరికి పదోన్నతి లభించవచ్చని, బీర్ల అయిలయ్య లేదంటే ఆది శ్రీనివాస్లను చీఫ్ విప్లుగా నియమిస్తారని, తద్వారా మంత్రి పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్న వాదనకు తెరపడినట్టవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
విప్ల భర్తీకీ సమీకరణాలు
అసెంబ్లీలో ప్రభుత్వ విప్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సీఎం రేవంత్ అంచనా వేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, మాల సామాజిక వర్గం నుంచి మేడిపల్లి సత్యం శ్రీగణేష్, ఎస్టీ కోటాలో మురళీ నాయక్, వెడ్మ బొజ్జుల పేర్లను పరిశీలిస్తున్నారని, సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల సమీకరణల్లో ఒక్కో వర్గానికి ఒకరిని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు విప్గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే విషయాన్ని కూడా సీఎం రేవంత్ సీరియస్గా పరిశీలిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ పదవుల పందేరం అధికారికంగా ఉండే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.