నేడే ‘కొహెడ’ మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన | CM Revanth to Lay Foundation Stone for Koheda Fruit Market on june 06 | Sakshi
Sakshi News home page

నేడే ‘కొహెడ’ మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

Jun 6 2026 5:57 AM | Updated on Jun 6 2026 5:57 AM

CM Revanth to Lay Foundation Stone for Koheda Fruit Market on june 06

239 ఎకరాల్లో..రూ.3,367.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం 

ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి 

అత్యాధునిక హంగులతో రిటైల్‌ జోన్, ఆక్షన్‌ హాల్, శీతలీకరణ షెడ్లు, డ్రైవ్‌–త్రూ మెలన్‌ మార్కెట్‌ 

విదేశీ ఎగుమతుల ప్రాంగణం, డైరీ, డ్రైఫ్రూట్స్, పౌల్ట్రీ, మీట్, ఫిష్, సీ ఫుడ్‌ ట్రేడ్‌ జోన్‌ ఏర్పాటు 

సాయంత్రం భారీ బహిరంగసభ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, రంగారెడ్డి జిల్లా: కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మార్కెట్‌ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్‌నగర్‌ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు.  

మార్కెట్‌ ప్రత్యేకతలివే.... 
 ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.3,367.35 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.32 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, మిగతాది ప్రైవేట్‌ భాగస్వామ్యం.ఈ మార్కెట్‌ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. 

⇒  ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న విక్రయాలు.. 2047 నాటికి 15.53 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగే అవకాశముంది. తద్వారా మార్కెట్‌ వార్షిక ఆదాయం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరగనుంది.  
⇒ వ్యాపారుల సంఖ్య 341 నుంచి 967కు, వినియోగదారుల సంఖ్య 16,450 నుంచి 53 వేల మందికి పెరుగుతుంది.  
⇒ వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్‌ప్లాజా, తిరిగి వెళ్లేందుకు ఆరు వరుసల ఎగ్జిట్‌ టోల్‌ ప్లాజా సహా క చ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్‌ వెయింగ్‌ బ్రిడ్జి.  

⇒  పూల వ్యాపారానికి సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్‌. దీని ద్వారా 3,600 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.  
⇒ వంద మందికి సరిపడా రైతు మార్కెట్‌. రిటైల్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం.  
⇒ రైతులు, హమాలీలు, వ్యాపారులు, సందర్శకులకు విశ్రాంతి భవనాలు, సమావేశ మందిరాలు. క్యాంటీన్, హెల్త్‌సెంటర్, పోలీసు ఔట్‌లెట్, ఫైర్‌ స్టేషన్‌ ఉంటుంది.  

⇒ మార్కెట్‌ మొత్తానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా నిలిచే టవర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్మించనున్నారు.  
⇒ ఇందులో బహుళజాతి వ్యాపారులు, సీసీ టీవీ వ్యవస్థ, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు హెలిపాడ్‌ ఏర్పాటు చేయనున్నారు.  
⇒ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సహా ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం 210 షాపులతో రిటైల్‌ వ్యాపార ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు 30 షాపులతో ప్రత్యేక వేదిక అందుబాటులోకి ఉంటుంది. 

⇒ మామిడి, బత్తాయి, సపోటా, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వంటి పండ్ల వేలానికి ఆరు ప్రత్యేక ఆక్షన్‌ హాళ్లు సహా 250 మేజనైన్‌ షాపులను వ్యాపారులకు కేటాయించనున్నారు.  
⇒  పండ్లు పాడవకుండా కాపాడేందుకు 335 షాపులతో కూడి న విశాలమైన నాలుగు శీతలీకరణ షెడ్లు నిర్మించనున్నారు.  
⇒ పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, పైనాపిల్‌ మార్కెటింగ్‌కు దేశంలోనే తొలి ‘డ్రైవ్‌–త్రూ మెలన్‌ మార్కెట్‌’ను నిర్మించబోతున్నారు.  
⇒  వ్యాపారస్తుల కోసం 52 ప్లాట్‌ ఫామ్స్‌ నిర్మిస్తారు.   
⇒ డైరీ, ఫ్రోజన్‌ ఫుడ్స్, డ్రైఫ్రూట్స్‌ కోసం 40 ఏసీ షాపులు సహా నానో క్లోరినేషన్, ఇన్‌–హౌస్‌ ఐస్‌ ఫ్లేక్‌ ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఫిష్‌ అండ్‌ సీ ఫుడ్స్‌ మార్కెట్‌ 
⇒  ఫౌల్ట్రీ, మాంస ఉత్పత్తుల విక్రయాలకు 24 ఏసీ షాపులను అందుబాటులోకి రానున్నాయి.  

దేశంలోనే ఇది అత్యాధునిక మార్కెట్‌: తుమ్మల
తుర్కయాంజల్‌: సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ దేశంలోనే అత్యాధునిక వ్యవసాయ మార్కెట్‌గా రూపుదిద్దుకోనుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్‌ సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు.

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్‌ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 79 ఉప మార్కెట్‌ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్‌ అభివృద్ధి, ధరల సమాచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement