రూ. 6 లక్షల సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కును అందించిన చిన్నారెడ్డి
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు
సీఎం ప్రజావాణి చొరవతో 17 నెలల చిన్నారికి పునర్జన్మ లభించింది. శ్వాసకోస ఇబ్బందులు, నిమోనియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి ఫీజు తగ్గేలా చూసి, ఆ చిన్నారి తల్లిదండ్రు లకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులయ్యారు.
ఆసుపత్రి ఖర్చుల కింద రూ.ఆరు లక్షల సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కును సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణిలో ఆ చిన్నారి తండ్రి భానోత్ శ్రీనుకు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కే - సముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ బానోతు శ్రీను, అంజలి దంపతుల 17 నెలల కుమారుడు వైష్ణవ్ నందన్ తీవ్ర జబ్బుతో ఆరోగ్యం క్షీణించడంతో గత జనవరి 7న సీఎం ప్రజావాణికి వచ్చి వారు సమస్య వివరించారు.
సీఎం ప్రజావాణి బృందం చొరవ తీసుకొని ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందేలా చూశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లకు చిన్నారి తల్లిదండ్రులు భానోత్ శ్రీను, అంజలి ధన్యవాదాలు తెలిపారు.


