పలు కార్పొరేషన్‌లకు కొత్త చైర్మన్‌లను నియమించిన కేసీఆర్‌

CM KCR Appoints New Chairmans For Various Corporations In Telangana - Sakshi

నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు 

ఆకుల లలిత, గజ్జెల నగేశ్, పాటిమీది జగన్మోహన్‌రావు, జూలూరి గౌరిశంకర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లకు పదవులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బీవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరిశంకర్, ‘తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ నియమితులయ్యారు.  

కీలకంగా పనిచేసిన వాళ్లకు..
తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఆకుల లలిత గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తాజాగా నామినేటెడ్‌ పదవి లభించింది. బీవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నామినేట్‌ అయిన గజ్జెల నగేశ్‌.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తండటాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారు.

ఇక టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్న పాటిమీది జగన్మోహన్‌రావు యువజన విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జీహెచ్‌ఎంసీ యువజన విభా గం ఇన్‌చార్జిగా పనిచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జూలూరు గౌరి శంకర్‌ పాత్రికేయుడు. రచయితగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. గతంలో బీసీ కమిషన్‌ సభ్యుడిగా చేసిన శంకర్‌కు ప్రస్తుతం నామినేటెడ్‌ పదవి లభించింది.

విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేసిన డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో 150కి పైగా కేసు లు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు.  కాగా యువ గాయకుడు సాయిచంద్‌ను రెండ్రోజుల క్రితం తెలంగాణ స్టేట్‌ వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా కేసీఆర్‌ నియమించిన విషయం తెలిసిందే.    

చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top