
హైదరాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వేళ నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వచ్చిన ఓ బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది . దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా.. లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, గురువారం రాత్రి భారత్ భూభాగంలో దాడులు చేసేందుకు దాయాది పాక్ యత్నించింది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో భారత సైన్యం ప్రతి దాడులకు దిగి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకుపోయింది. కరాచీ, ఇస్లామాబాద్ లలోని ఆ దేశ రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. భారత్ మెరుపు వేగంతో చేసిన ఆ భీకర దాడులకు పాకిస్తాన్ కు దిమ్మతిరిగిపోయింది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ వ్యూహాత్మకంగా చేపట్టిన దాడులకు పాకిస్తాన్లోని సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారై.. సురక్షిత ప్రాంతానికి తరలిపోయినట్లు తెలుస్తోంది.