గొప్పలు చెప్పుకోకుండా బాధ్యత వహించాలి | BC Commission Chairman Niranjan Comments on Poor student dies due to adulterated food | Sakshi
Sakshi News home page

గొప్పలు చెప్పుకోకుండా బాధ్యత వహించాలి

Nov 27 2024 6:21 AM | Updated on Nov 27 2024 6:21 AM

BC Commission Chairman Niranjan Comments on Poor student dies due to adulterated food

విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి 

రెండేళ్ల నుంచి అద్దె చెల్లించలేకపోవడం ఏమిటి?  

రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘కల్తీ ఆహారంతో పేద విద్యార్థి మృతి చెందడం బాధాకరం. ఈ దుస్థితికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యులు కారా ? దేశంలో ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోకుండా బాధ్యతగా వహించాలి. ఏదో ఒకరోజు కాకుండా.. అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలి. విద్యార్థులు వసతిగృహాల్లో ఉన్నారంటే వారు ఎంత పేదవారో అర్థం చేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న బాలుర, బాలికల వసతి గృహాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. వసతి గృహాలు పూర్తి శిథిలావస్థగా మారాయంటే దానికి అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యమే అందుకు నిదర్శనం’అని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ స్పష్టం చేశారు.

మంగళవారం రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాలలక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో ఒక హాస్టల్‌ పరిస్థితి చూద్దామని అక్కడకు వెళ్లాం. రెండేళ్ల నుంచి అద్దె చెల్లించడం లేదని చెప్పడంతో తలదించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబ్‌నగర్‌ హాస్టళ్లలో 200 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట దాదాపు 300 మందికిపైగా ఉన్నారు. ఇలాఉంటే విద్య ఎలా సాగుతుంది. ఇలాంటి వాటిపై రాజకీయ నేతలందరూ దృష్టి పెట్టాలి’అని ఆకాంక్షించారు.  

తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ చర్యలు 
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఎవరైన అపోహలు కల్పించినా, తప్పుడు సమాచారం ఇచ్చి నా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అలా చేసే వారిని తెలంగాణ సమాజం, బీసీలు క్షమించరన్నారు. బహిరంగ విచారణలో ‘తోలుబొమ్మలాట వృత్తిలో ఉన్న వారికి కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని, కలెక్టర్, తహసీల్దార్‌కు ఆదేశాలివ్వాలని, దేవాలయాల్లో గానుగ నూనె వాడుతారని, దానికి గానుగ వృత్తి ఉన్నవారికి అవకాశం కలి్పంచాలని, గంగపుత్రులను బీసీ ‘బీ’నుంచి బీసీ డీకి మార్చాలని పలువురు కోరారని కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. పందిరి వేసే మేదర కులం వారికి డెకరేషన్, తయారీపై శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారన్నారు. 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement