
కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో మరో పిల్
వెంటనే విచారణ చేపట్టాలన్న గత పిల్ న్యాయవాది
నేడు వాదనలు వినేందుకు సిద్ధమన్న హైకోర్టు
విచారణ చేపట్టనున్న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘సర్వే నంబర్ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్ చెట్లను తొలగిస్తోంది.
హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి’అని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్ దాఖలు చేసిన వటా ఫౌండేషన్ (ఈఎన్పీవో) తరఫు న్యాయవాది ఒమర్ ఫారుక్.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
వాస్తవానికి వటా దాఖలు చేసిన పిల్ను ధర్మాసనం ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. కానీ, సర్కార్ చెట్లను తొలగించి భూమి చదును చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు పిల్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ.75 కోట్లకు సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూములను టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. దీనికి సంబంధించి గత ఏడాది జూన్ 26న రెవెన్యూశాఖ జారీ చేసిన జీవో 54ను సవాల్ చేస్తూ వటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 24న విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు చెప్పాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందా? చేస్తే ఎలాంటి ఆదేశాలిస్తుంది? అనేది ఉత్కంఠగా మారింది.