ప్రీస్కూల్స్‌గా అంగన్‌వాడీలు! | Anganwadis as preschools | Sakshi
Sakshi News home page

ప్రీస్కూల్స్‌గా అంగన్‌వాడీలు!

May 31 2024 4:43 AM | Updated on May 31 2024 4:43 AM

Anganwadis as preschools

రాష్ట్ర ప్రభుత్వ యోచన..

తొలి విడతలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న 15 వేల కేంద్రాల అప్‌గ్రెడేషన్‌

ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు.. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్‌)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. 

తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీస్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల సమాచారాన్ని క్రోడీకరించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. 

ఈ కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన మౌలిక వస తులు,నిధులు...తదితర అంశాలతో ప్రతిపాదనలను ప్రాథమికంగా ఖరారు చేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో.. జూన్‌ 6 తర్వాత ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.

వసతులకు రూ.30 కోట్లు
ప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో 15,640  కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటిల్లోనే సూత్రప్రాయంగా ప్రీ స్కూల్‌ విద్యను అమలు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. 

వీటి పరిధిలోని 3 లక్షల మంది 3 – 6 సంవత్సరాల మధ్యనున్న చిన్నారులకు ప్రీస్కూల్‌ విద్యను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా కార్పెట్ల కొనుగోలు కోసం రూ.3.57 కోట్లు బడ్జెట్‌ అవసరమని ప్రతిపాదించింది. పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్‌ ర్యాక్స్‌ కోసం రూ.7.53 కోట్లు ప్రతిపాదించింది. ఆయా కేంద్రాలకు కొత్తగా రంగులు వేసేందుకు సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన చేసుకుంది. 

పిల్లలకు ప్రత్యేక యూనిఫాం కోసం రూ.6.90 కోట్లు, ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో రెండు టేబుల్స్‌ ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం రూ.12.96 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా రూ.30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.

కొత్త టీచర్లా? ప్రస్తుత సిబ్బందేనా?
ప్రీస్కూల్స్‌లో విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్య కత ఉంది. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరినవారే. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్తగా టీచర్లను నియ మిస్తారా? లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. 

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం దక్కిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement