సొంతూరిలో సమాధి అడ్డన్నారు..
ఘట్కేసర్లో డబ్బు తీసుకొని మోసం
పోలీసు స్టేషన్ వద్ద సూర్యనారాయణమూర్తి
హైదరాబాద్, అంబర్పేట: రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడికి సమాధి కట్టించాలనుకుంటున్న ఓ తండ్రి చేస్తున్న ప్రయత్నాన్ని ఓ వ్యక్తి ముందుకు కదలనివ్వడం లేదు. సమాధి నిర్మిస్తా అంటూ డబ్బుతీసుకుని నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఆదివారం అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... డీడీ కాలనీకి చెందిన సూర్యనారాయణ మూర్తి కుమారుడు సురేష్(34) 2022లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భువనగిరి జిల్లా సీమలకొండూరులోని సొంతపొలంలో దహనసంస్కారాలు చేసి అక్కడ భారీ ఖర్చుతో సమాధి కట్టించాడు. అక్కడ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాధి అడ్డు వస్తుందని, ఇక్కడి నుంచి తరలించాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను కుమారుడి అస్థికలను తీసుకుని ఘట్కేసర్లోని స్మృతివనంలో నిర్వాహకులతో సంప్రదించి అస్థికలను పూడ్చిపెట్టాడు.
పూడ్చిపెట్టిన ప్రాంతంలో సమాధి కట్టించడానికి రామ్చందర్ అనే వ్యక్తిని సంప్రదించడంతో రూ. లక్ష ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్ ఇవ్వాలని ప్రతిపాదించాడు. దీంతో సూర్యనారాయణ మూర్తి రూ. 50 వేలు అడ్వాన్స్ను ఈ ఏడాది మార్చి 25న ఆన్లైన్లో చెల్లించాడు. అడ్వాన్స్ తీసుకున్న రామ్చందర్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో అతను గత నెల అంబర్పేట పోలీసులను ఆశ్రయించగా నెల రోజుల్లో పూర్తి అయ్యేలా హామీ ఇప్పించారు. అయినా అతని తీరులో మార్పు రాకపోవడంతో ఆదివారం తిరిగి పోలీసు స్టేషన్కు వచ్చి న్యాయం చేయాలని కోరాడు. అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు.


