‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్‌ ఆదివాసీలు | Ailapur Adivasis villagers boycott survey: Telangana | Sakshi
Sakshi News home page

‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్‌ ఆదివాసీలు

Nov 11 2024 3:37 AM | Updated on Nov 11 2024 3:37 AM

Ailapur Adivasis villagers boycott survey: Telangana

కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్‌లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్‌ మల్లెల లక్ష్మయ్య అన్నారు.

అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్‌ లైన్‌ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement