Ailapur Village
-
ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత దాకా ఆపరేషన్ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా అంటోంది. ఐలాపూర్లో ఓ భారీ భవనంపై కూల్చివేతపై కోర్టు సోమవారం స్టే ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భవనం పూర్తిగా కూల్చకుండా వదిలేసింది హైడ్రా. కూల్చకుండా వదిలేస్తే పక్కన ఉన్న భవనంపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా కూల్చాల్సిందేనని అంటున్నారు. కానీ.. హైడ్రా చర్య కోర్టు ధిక్కరణ(కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కిందకే వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఒకవేళ మొండిగా కూల్చివేతలు మొదలుపెడితే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఏం జరిగిందంటే.. శనివారం అమీన్పూర్ మండల పరిధిలో పలు చోట్ల అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. ఆ సమయంలోనూ విపరీతమైన గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత ఆగిందని కాసేపు.. హైడ్రానే కావాలని కాసేపు కూల్చివేతలు ఆపిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఈలోపు ఐలాపూర్ కూల్చివేతలపై ఓ వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతకు దిగారని పేర్కొన్నారు. అయితే.. హైడ్రా తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ.. కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందేనని.. పైగా ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదంటే తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
అక్కాతమ్ముడి ఆత్మహత్యాయత్నం
లింగంపేట,న్యూస్లైన్ : మండలంలోని ఐలాపూర్లో బుధవారం అక్కాతమ్ముడు విషం సేవించి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్సై రాకేశ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మల్లయ్యల పోచయ్య, ఆయన అక్క మానెవ్వ కుటుంబ సమస్యలు, మానసిక వ్యధతో ఆత్మహత్యకు యత్నించారు. పోచయ్య భార్య నర్సవ్వ కొంతకాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచూ భర్తతో గొడవ పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసేది. ఈక్రమంలో పోచయ్య ఇటీవల భార్యతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. రూ.50 వేలు భార్యకు అందించాడు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మానెవ్వ, పోచయ్యలు ఆత్మహత్యకు యత్నించారని ఎస్సై తెలిపారు. స్థానికుల సమాచారంతో ఇద్దరిని 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని చెప్పారు. నాగిరెడ్డిపేటలో వివాహిత.. నాగిరెడ్డిపేట : మండలకేంద్రానికి చెందిన చిరుకొండ సవిత(23) బుధవారం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. సవిత తన అత్త అంజవ్వతో వ్యవసాయభూమి విషయమై గొడవపడ్డారు. ఈక్రమంలోనే ఆము ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఒంటిపై చల్లుకోని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేసి, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సవిత భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


