ఇద్దరు రియల్టర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు 

ACB Checks Two Realtors Office And House In Medak - Sakshi

సాక్షి,మెదక్‌/తూప్రాన్‌/వెల్దుర్తి: మెదక్‌ జిల్లా లో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట మండలం పులిమామిడిలలో ఈ తనిఖీలు ఏకకాలంలో జరిగాయి. మెదక్‌ మాజీ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ 112 ఎకరాల భూమికి ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం తీసుకున్న కేసు  దర్యాప్తులో భాగంగా.. వెల్దుర్తి మండలం మాసాయిపేటకు చెందిన ఏర్పుల శివరాజ్‌ తూప్రాన్‌లో శ్రీనివాస ప్లానర్స్, బిల్డర్స్, కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. మాసాయిపేటలో 10 మంది దళితులకు కేటాయించిన 2.20 ఎకరాల ఇనాం భూమిని, ఎకరాకు రూ.50 వేల చొప్పున గతేడాది కొనుగోలు చేశాడు. నగేశ్‌ ఇంట్లో సోదాల్లో దీనికి సంబంధించిన పత్రాలు లభించాయి.

దీంతో ఏసీబీ అధికారులు శివరాజ్‌ కార్యాలయం, ఇంట్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇనాం ములకు సంబంధించిన రైతులను, సర్వేయర్‌ నర్సింహులును విడివిడిగా విచారించారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఏడు ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో తూప్రాన్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, మీనాక్షీ కిరాణం, సూపర్‌ మార్కెట్‌ యాజమాని నాగిళ్ల ప్రభాకర్‌ గుప్త ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ప్రభాకర్‌ భాగస్వాములు చీర్న రాజేశ్వర్‌ గుప్త, మురళి తదితరులను కూడా విచారించారు. ప్రభాకర్ ‌గుప్త ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top