మధ్యాహ్న భోజనం వికటించి 89 మందికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం వికటించి 89 మందికి అస్వస్థత

Published Sat, Nov 12 2022 3:03 AM

89 Students Fell Ill After Eating Lunch In School - Sakshi

నవీపేట(బోధన్‌)/గాంధారి (ఎల్లారెడ్డి)/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మధ్యాహ్న భోజనం వికటించి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పాఠశాలల్లో శుక్రవారం మొత్తం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 188 మంది విద్యార్థులు మధ్యాహ్నం ఎప్పటిలాగే భోజనం చేశారు.

సాయంత్రం 4 గంటల సమయంలో తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పితో వరుసగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా ట్యాబ్లెట్లు, ఇంజక్షన్‌లతో చికిత్స చేశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఏడుగురు విద్యార్థులకు సెలైన్‌ ఎక్కించారు. అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 305 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా 25 నుంచి 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి సెలైన్‌ ఎక్కించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వీరికి వైద్య చికిత్సలు అందించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది.

Advertisement
Advertisement