భోజనం నాణ్యతపై పోలీసులకు చెబుతున్న చిన్నారులు
మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పోలీసులకు విద్యార్థుల ఫోన్
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఘటన
జి.కొండూరు: ‘సార్.. ఆ అన్నం అస్సలు బాగోలేదు. మేం తినలేం...’ అంటూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో వడ్డించిన అన్నం బాగాలేదంటూ తీసుకువెళ్లి బకెట్లో పడేశారు. అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి విచారణ చేయగా, భోజనం బాగోలేదని, తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారం అంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై ఎంఈవో బాలుని వివరణ కోరగా... మధ్యాహ్న భోజనం వివాదం తమ దృష్టికి రావడంతో ఒక ఉపాధ్యాయురాలిని పర్యవేక్షణాధికారిగా నియమించినట్లు చెప్పారు.

పిల్లలకు అందిస్తున్న భోజనంలో ఎటువంటి లోపాలు లేవని ఆ ఉపాధ్యాయురాలు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయినా బుధవారం మరోసారి తహసీల్దార్, ఎంపీడీవోతో కలిసి పాఠశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పాఠశాల హెచ్ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకుల మధ్య విభేదాల నేపథ్యంలో పథకం ప్రకారమే ఈ వివాదం సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


