రేడియాలజిస్ట్, సిబ్బందిపై టీడీపీ మూకల దాడి
మహిళా సిబ్బందితోనూ దురుసు ప్రవర్తన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ మూకల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తరచూ దాడులకు దిగుతున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడులకు పాల్పడిన వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు.
వెంకటాచలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో సోమవారం సీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ విద్యార్థికి వైద్యం చేయించి బెడ్పై ఉంచారు. ఇంతలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆ విద్యార్థికి ఎక్స్రే తీయాలని రేడియాలజిస్ట్, వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి బాగుందని, సెలైన్ కూడా పెట్టామని, వైద్యాధికారి సూచనల మేరకే ఎక్స్రే తీయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు.
అడ్డుకోబోయిన మహిళా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించిన సిబ్బందిని దూషిస్తూ, ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని వీధి రౌడీల్లా ప్రవర్తించారు. కొద్ది సేపటి తర్వాత వచి్చన కొందరు వ్యక్తులు గొడవ చేస్తున్న వారిని అక్కడి నుంచి లాక్కొని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.


