నాన్‌కేడర్‌ నుంచి ఐపీఎస్‌

20 Police Officers Promotion Non Cadre To IPS In Telangana - Sakshi

20 మంది పోలీస్‌ అధికారులకు పదోన్నతి

నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

ఐదేళ్ల నిరీక్షణకు దక్కిన ఐపీఎస్‌ హోదా 

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రాష్ట్ర పోలీస్‌ శాఖలో నాన్‌కేడర్‌ ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులకు ఐపీఎస్‌ హోదా దక్కింది. 20 మంది అధికారులకు ఐపీఎస్‌ పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2007లో గ్రూ ప్‌–1లో డీఎస్పీలుగా చేరిన అధికారులతోపా టు ఎస్‌ఐగా కేరీర్‌ ప్రారంభించి నాన్‌కేడర్‌ ఎస్పీలుగా ఉన్న వారికీ కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతి కల్పించింది. రాష్ట్రానికి కేడర్‌ అలాట్‌మెంట్‌లో భాగంగా ఇచ్చిన ప్రమోషన్‌ కోటాలో ఖాళీగా ఉన్న 23 ఐపీఎస్‌ పోస్టులకు సంబంధించి ఈ నెల 11న సెలెక్షన్‌ కమిటీ స మావేశం నిర్వహించింది.

రాష్ట్రం నుంచి 23 మంది పేర్లను ప్రతిపాదించగా ముగ్గురిపై క్రమశిక్షణ చర్య లు పెండింగ్‌లో ఉండటంతో కమిటీ వారి పేర్లను పెండింగ్‌లో పెట్టింది. దీంతో మిగిలిన 20 మంది నాన్‌కేడర్‌ ఎస్పీలకు ఐపీఎస్‌ హోదా పదోన్నతి కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది. యూపీఎస్సీ సెలెక్షన్‌ కమిటీ ఈనెల 17న జాబితాను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల విభాగంతోపాటు కేంద్ర హోంశాఖకు పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జాబితాను ఆమోదిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పదోన్నతి పొందిన అధికారులు 
2016 సంవత్సరం జాబితాలో ఎన్‌.కోటిరెడ్డి, ఎల్‌.సుబ్బారాయుడు, కె.నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్‌రావు, టి.శ్రీనివాస్‌రావు, టి.అన్నపూర్ణ, పీవీ పద్మజ, జానకీ ధరావత్, 2017 జాబితాలో పి.యాదగిరి, 2018 కోటా కింద కేఆర్‌ నాగరాజు, ఎం.నారాయణ, 2019 జాబితాలో వి.తిరుపతి, ఎస్‌.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి, కె.సురేష్‌కుమార్, 2020 జాబితాలో బి.అనురాధ, సి.అనసూయ, షేక్‌ సలీమా, ఆర్‌.గిరిధర్, సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ పదోన్నతి పొందారు. క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉండటం వల్ల జానకీ షర్మిల, వై.సాయిశేఖర్, వి.భాస్కర్‌రావు పదోన్నతి రాకుండా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇంటిగ్రెటి సర్టిఫికెట్‌ తీసుకొని యూపీఎస్సీకి సమర్పిస్తే వీరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఐదేళ్ల పోరాటంతో ఫలితం.. 
రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సీనియారిటీ జాబితా వివాదంతో కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతి ఐదేళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ప్రతీ ఏటా ఖాళీల భర్తీకి హోంశాఖ ప్యానల్‌ నోటిఫికేషన్‌ ఇస్తూ వచ్చినా సీనియారిటీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పదోన్నతి ఆలస్యమైంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లోనే సీనియారిటీ సమస్యను పరిష్కరించడంతో 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యానల్‌ పదోన్నతులను యూపీఎస్సీ, కేంద్ర హోంశాఖ ఒకేసారి క్లియర్‌ చేశాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top