సామాజిక సేవ
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ ఆదివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రైజింగ్ డేను అన్ని ఫీల్డ్ యూనిట్లలో ఎంతో ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బలగంలో ఉన్న క్రమశిక్షణ, ఐక్యతను చాటిచెప్పారు. సెప్టెంబర్ 20, 1985న (సవరించిన ఆర్పీఎఫ్ చట్టం ప్రకారం) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు కేంద్ర సాయుధ బలగాల హోదా లభించిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా ఈ రైజింగ్ డేను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ చైన్నె డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమీషనర్ వల్లేశ్వర్ బాబూజీ తొక్కల నాయకత్వంలో అనేక ప్రభావవంతమైన సామాజిక సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. సిబ్బందిలో శారీరక దఢత్వాన్ని, దేశ సమగ్రతను పెంపొందించేందుకు ప్రత్యేక యోగా సెషన్లు ,యూనిటీ రన్ (ఐక్యతా పరుగు) నిర్వహించారు.
ప్రయాణికుల అవగాహన:
ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు, భద్రతపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. పరిపాలనా సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కార్యాలయాలు, బ్యారెక్ ప్రాంగణాల్లో విస్తత పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పాత రికార్డులను వర్గీకరించి తొలగించారు. వేడుకల ముగింపుగా చైన్నె డివిజన్లోని అన్ని బ్యారేకుల్లో సంప్రదాయ సహపంక్తి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తమిళనాడు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన కే7 (ఐసీఎఫ్ పోలీస్ స్టేషన్), వి4 (రాజమంగళం పోలీస్ స్టేషన్, కొలత్తూర్) ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఇది శాఖల మధ్య ఉన్న సమన్వయాన్ని, మైత్రిని ప్రతిబింబించింది. అలాగే, ప్రయాణికుల భద్రతతో పాటు సమాజానికి కరుణతో సేవ చేయడంలో తమకున్న కట్టుబాటును ఆర్పీఎఫ్ ఈ వేడుకల ద్వారా మరోసారి చాటుకుంది.


