21 జిల్లాల్లో భారీ వర్షాల అలర్ట్
సాక్షి, చైన్నె: ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు చైన్నె వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం తూర్పు–మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడనుందని, 22వ తేదీ నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం, పశ్చిమ–మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాలలో తమిళనాడులోని తంజావూరు, నీలగిరి, కోయంబత్తూర్, ధర్మపురి, కృష్ణగిరి, దిండిగల్, పుదుక్కోట్టై, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, పెరంబలూరు, అరియలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, తిరుచ్చి జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చైన్నె, తిరువళ్లూరు, రాణిపేట, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే 23, 24 తేదీల్లో పశ్చిమ కనుమల పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో నమోదైన రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణగిరి జిల్లా పేట ముగిలంలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే పుదుచ్చేరిలోని తిరుకనూరు, ధర్మపురి జిల్లా మరందహళ్లిలలో 12 సెం.మీ, మదురై పులిపట్టిలో 10 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


