– ఇద్దరి అరెస్టు
తిరువళ్లూరు: మత్తుమాత్రలు విక్రయించిన హైదరాబాదుకు చెందిన యువకుడితో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మత్తుమాత్రలు, గంజాయి, గుట్కాతో పాటు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే ఎస్పీ సాయి ప్రణీత్ గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు సరిహద్దు ప్రాంతాలైన పొన్పాడి, ఎలావూర్, ఊత్తుకోటతో సహా ఇతర ప్రాంతాల్లో గట్టి నిఘాను వుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు రైల్వేస్టేషన్ సమీపంలోని పెద్దకుప్పం వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకుల్లో ఒకరు తెలంగాణ జిల్లా హైదరాబాదు నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్(29), కర్ణాటకు చెందిన మధీన్ భాషా(46)గా గుర్తించారు. వీరిద్దరూ యువతే లక్ష్యంగా మత్తుమాత్రలు విక్రయించడానికి యత్నించినట్టు నిర్దారించారు. వీరి నుంచి సుమారు 3,900 మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


