ధారాపురం నుంచి సత్యభామ మళ్లీ పోటీ అభ్యర్థుల కసరత్తులలో అన్నాడీఎంకే, ఎన్టీకే డీఎండీకే ప్రేమలతతో డీఎంకే అభ్యర్థుల భేటీ
మరగతం కుమరవేల్, సత్యభామ
తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల సందడి రాజుకుంది. డీఎంకే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అధికార టీవీకే సైతం తమ అభ్యర్థులుగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన అన్నాడీఎంకే మాజీలకే అవకాశం కల్పించింది. మధురాంతకంలో మరగతం కుమర వేల్, ధారాపురంలో సత్యభామలు మళ్లీ పోటీచేయనున్నారు. ఈ రెండు రిజర్వుడ్ స్థానాలలో తాజాగా ఎన్నికల వాతావరణం రాజుకోవడంతో భద్రతా పరంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 6న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. డీఎంకే అభ్యర్థులుగా మధురాంతకంలో పరందామన్, ధారాపురంలో సుకన్య పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు గురువారం మిత్ర పక్షమైన డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్తో భేటీ అయ్యారు. తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. అదే విధంగా డీఎంకే కూటమిలో ఉన్న ఇతర చిన్న పార్టీల నాయకులను సైతం కలిసి మద్దతు సేకరించారు. ఇక, ఈ ఉప ఎన్నికలలో డీఎంకే చరిత్ర సృష్టించే గెలుపు నమోదు చేయనున్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. అదే సయయంలో టీవీకే సైతం అభ్యర్థులను ప్రకటించింది.
ఆ ఇద్దరికి మళ్లీ ఛాన్స్
అసెంబ్లీ ఎన్నికలలో మదురాంతకం నుంచి అన్నాడీఎంకే తరపున మరగతం కుమర వేల్, ధారాపురం నుంచి సత్యభామ గెలిచారు. ఈ ఇద్దరు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతోనే ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితులలో అధికార టీవీకేలో వీరికి ఛాన్స్ ఇచ్చేనా లేదా, ఇది వరకు స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన వారికి అవకాశం ఇచ్చేనా అన్న చర్చ జరుగుతూ వచ్చింది. అయితే, ఆ ఇద్దరికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. మతతత్వ రహిత సామాజిక న్యాయ విజయ కూటమి తరఫున టీవీకే అభ్యర్థులుగా మధురాంతకం నియోజకవర్గం నుండి పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మరగతం కుమరవేల్, ధారాపురం నియోజకవర్గం నుండి తిరుప్పూర్ దక్షిణ జిల్లా కార్యదర్శి సత్యభామ పోటీ చేయనున్నారని ప్రకటించారు. పార్టీ శ్రేణులందరూ విజయం ఒక్కటే లక్ష్యంగా అభ్యర్థుల గెలుపునకు విస్తృతంగా పనిచేయాలని, ప్రజల్లోకి దూసుకెళ్లి చారిత్రాత్మక విజయాన్ని అందించాలని సీఎం విజయ్కోరారు. ఇక, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిఆనంద్ స్పందిస్తూ మంత్రులు నియోజకవర్గాల్లో మాట్లాడేటప్పుడు ఎన్నికల కోడ్ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక, తమకు ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కడం, విజిల్ చిహ్నం తమ పార్టీచిహ్నంగా మారడంతో టీవీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుదుచ్చేరిలోనూ
ఉప సందడి
సీఎం రంగస్వామి రాజీనామా నేపథ్యంలో తట్టాన్ చావడికి ఉప ఎన్నిక ప్రకటించారు. డీఎంకే అభ్యర్థిగా ఇక్కడ సేతు సెల్వం పోటీచేస్తున్నారు. డీఎంకే ఎంపీ జగత్ రక్షకన్ పుదుచ్చేరి తట్టాన్చావుడి ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ అభ్యర్థికి మద్దతుగా గురువారం ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. డీఎంకే ఎమ్మెల్యే శివాతోపాటుగా ముఖ్య నేతలందరూ సేతు సెల్వం గెలుపు లక్ష్యంగా కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఈసందర్భంగా జగత్ రక్షకన్ మాట్లాడుతూ, తమిళనాడులోనూ, పుదుచ్చేరిలోనూ డీఎంకే చాలా బలమైన పార్టీ అని, డీఎంకే అనేది ఒక పెద్ద మర్రి చెట్టు అని వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామన్నారు. సీఎం రంగస్వామి ఇక్కడ ఏడు సార్లు గెలిచారని గుర్తుచేస్తూ, ఈసారి తమఖాతాలో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తట్టాన్చావుడి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో సీపీఐ తరఫున అభ్యర్థి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీమ్ నేతృత్వంలోని బృందం చైన్నెలో ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే, కాంగ్రెస్, వీసీకే, సీపీఎం నేతల మద్దతును సైతం కోరే పనిలో నిమగ్నమయ్యారు.
మధురాంతకం నుంచి మరగతం కుమరవేల్


