సాక్షి, చైన్నె: తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలపై విధించిన స్టేను మద్రాస్ హైకోర్టు పొడిగించింది. ఈ కేసు తుది విచారణను ఈనెల 28కి కోర్టు వాయిదా వేసింది. వివరాలు.. తిరుచ్చి తూర్పు , కరూర్, విరాలిమలై, పెరుంతురై, అంబాసముద్రం స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటన ఇవ్వకూడదని సవాలు చేస్తూ పాళ యంకోటైకి చెందిన బీజేపీ నేత వెంకటాచలపతి మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల కేసులు పెండింగ్లో ఉన్నందున ఈ స్టే కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్టే విధించింది.ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని సీఎం విజయ్ తరఫున దాఖలైన కౌంటర్లో స్పష్టం చేశారు. పిటిషనర్ సంబంధిత నియోజకవర్గాల ఓటరు కాదని, కావాలనే ఎన్నికలను ఆలస్యం చేసే దురుద్దేశంతో ఈ పిటిషన్ వేశారని తెలిపారు. మాజీ మంత్రులు సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య తదితరులు కూడా స్టే ఎత్తివేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. పెరుంతురై మాజీ ఎమ్మెల్యే జయకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదిస్తూ.. జయకుమార్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇప్పటికే కొట్టివేయబడిందని, కాబట్టి స్టేను ఎత్తివేయాలని కోరారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఇంకా ఉత్తర్వుల కాపీ అందలేదని తెలిపారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టేను పొడిగిస్తూ, ఈ కేసు తుది విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు.
జయకుమార్ కు వ్యతిరేక పిటిషన్ తిరస్కృతి
పెరుంతురై పెరుందురై నియోజకవర్గం నుం డి గెలిచిన అన్నాడీఎంకేకు రాజీనామా టీవీకేలోకి జయకుమార్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన గె లుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ టి. భరత చక్రవర్తి విచారించారు. ప్రత్యర్థి తోప్పు వెంకటాచలం దాఖలు చేసిన కేసులో చట్టబద్ధమైన తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జయకుమార్ వాదనతో ఏకీభవిస్తూ ఆ ఎన్నికల పిటిషన్ను పూర్తిగా కొట్టివేశారు.
ఉప సమరానికి రెడీ
రాష్ట్రంలో ఏడు స్థానాలు ఖాళీగా ఉండగా, ఐదు స్థానాలు కోర్టు స్టే రూపంలో ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా మిగిలిన మదురాంతకం, తారాపురం స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. అక్టోబరు 6న జరగనున్న ఈ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. దీంతో తమ సిట్టింగ్ స్థానాలను మళ్లీ దక్కించుకునే దిశగా అన్నాడీఎంకే కసరనత్తులు చేపట్టింది ఎన్నికలలో పోటీ చేసే ఆశావహుల నుంచి గురువారం వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శిపళణి స్వామి నిర్ణయించారు. ఇక, రాజీనామా చేసిన పార్టీలోకి చేరిన వారికే అవకాశం ఇచ్చే దిశగా టీవీకే చీఫ్, సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమాధానం ఇవ్వకుండా వెళ్లి పోయారు.ఇక, ఈ రెండు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.


