వేలూరు: దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగుల సంక్షేమ అధికారి బాబు అన్నారు. వేలూరు కలెక్టరేట్లో దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్సెల్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక అధికారిగా అసిస్టెంట్ కలెక్టర్ రామ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం 35 కిలోల రేషన్ బియ్యం అందజేస్తున్నారని, అయితే ఉపాధి హామీ పథకంలో తమకు పనులు కల్పించడం లేదన్నారు. అలాగే ఐరిష్ స్కానింగ్ చేయక పోవడంతో తమకు ఆధార్ కార్డులతో పాటు రేషన్ కార్డులు పొందలేక పోతున్నామన్నారు. వీటి ద్వారా సంక్షేమ పథకాలు ఏ విధంగా పొందగలని ప్రశ్నించారు. ఇందుకు అధికారులు మాట్లాడుతూ వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అనేక మంది పెన్షన్లు, ఇంటి పట్టాలు, బ్యాంకు రుణాలు తదితర వాటిపై వినతిపత్రాలు సమర్పించారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


