తిరువళ్లూరు: వినాయకచవితి సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసే ప్రతిమల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కవిత ఆదేశించారు. వినాయకచవితిని పురస్కరించుకుని తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ కవిత హాజరై మాట్లాడుతూ విగ్రహాల ప్రతిష్టించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పని సరిగ్గా తీసుకునేలా ఆదేశాల ఇవ్వాలని సూచించారు. విగ్రహలను ప్రతిష్టించే సమయంలో నిబందనలను కచ్చితంగా పాటించాలి. విగ్రహాలకు సమీపంలో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల సంచారం వుంటే పోలీసులకు సమాచారం అందేలా చూడాలని కోరారు. దీంతో పాటూ విగ్రహాలు నీటిలో సులభంగా కరిగే విధంగా ఉండాలన్న కలెక్టర్, పర్యావరణానికి ముప్పులేని విగ్రహాలను ప్రతిష్టించాలని ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జన ప్రాంతాల ఎంపికపై ముందుగానే ప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ సాయి ప్రణీత్, పొన్నేరి సబ్కలెక్టర్ అబ్దుల్రజాక్ పాల్గొన్నారు.


