– కలైమామణి మాధవపెద్ది మూర్తి
కొరుక్కుపేట: తెలుగువారు తమ మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయమని, ఈ తీరు మారాలని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కలైమామణి మాధవపెద్ది మూర్తి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 24వ అంతర్ పాఠశాల వార్షిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలైమామణి మాధవపెద్ది మూర్తి పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విద్యార్థులకు ఇలాంటి పోటీలు పెట్టీ వాటి ప్రతిభను వెలికి తీయడం, తద్వారా తెలుగు భాషకు సమితి చేస్తున్న ఈ సేవ ఇలాగే కొనసాగాలని కోరారు. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా తమ భాషను ఎక్కడా ఎవరూ మర్చిపోకుండా నేర్చుకుంటే, ఇక్కడున్న తెలుగువారు తమ మాతృభాషను పట్టించుకోకపోవడం శోచనీయమని, ఈ తీరు మారాలని అన్నారు. ఈనెల 7వ తేదీన స్థానిక ఆంధ్ర బాలానంద సంఘంలో జరిగిన పోటీల్లో మొత్తం 9 తెలుగు పాఠశాలల విద్యార్థులు పాల్గొని 51 మంది విజేతలకు బహుమతులను, ధ్రువపత్రాలు సమితి నిర్వాహకులు అందించారు. ముందుగా తెలుగుతల్లి ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు డా. అజంతా కే, శంకరరావు అధ్యక్షత వహించారు. డీఆర్బీసీసీసీ హిందూ కళాశాల తెలుగు సహాయాచార్యులు డా. తుమ్మపూడి కల్పన, కార్యదర్శి దామెర్ల పద్మావతి, సహకార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు.


