సాక్షి, చైన్నె : వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ విక్రయాలు, సర్వీసింగ్, రీసైక్లింగ్ విభాగంలో సేవలందిస్తున్న చైన్నెకి చెందిన కొంగ్రూయోన్స్ హోల్డింగ్స్ దక్షిణాదిలో భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చైన్నెలో కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎ.ఎమ్. షాజహాన్, బీఏజెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సి.ఓ.ఓ షర్ఫుద్దీన్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులో 30 వరకు ఉన్న రిటైల్, సర్వీస్ సెంటర్ల సంఖ్యను 2028 నాటికి దక్షిణాది ప్రధాన నగరాల వ్యాప్తంగా 300 అవుట్లెట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈసందర్భంగా ప్రకటించారు. వీధి చివర ఉండే సాధారణ రిపేర్ షాపులకు భిన్నంగా, అధునాతన సాంకేతికతతో కూడిన 15 స్థిరమైన ప్రీమియం గో ఫిక్స్ సర్వీస్ – ఎక్స్పీరియనన్స్ సెంటర్లను మార్చి 2027 నాటికి ప్రారంభించనున్నామని వివరించారు. ఇందులో భాగంగా తొలి విడతగా చైన్నె, బెంగళూరు నగరాల్లో 5 చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల లైఫ్సైకిల్ను (ఉత్పత్తి నుంచి రీసైక్లింగ్ వరకు) నిర్వహించేందుకు 8 ప్రత్యేక బ్రాండ్లను నడుపుతోందని, రిటైల్ విక్రయాలు, రిపేర్ – సర్వీస్, డివైజ్ ప్రొటెక్షన్, బైబ్యాక్,ఎక్స్ఛేంజ్, యాక్సెసరీస్, డిస్ట్రిబ్యూషన్, టెక్నాలజీ – డేటా సేవలు, ఎలక్ట్రానిక్స్ రిపేర్ రంగాన్ని మరింత వ్యవస్థాగతంగా, నమ్మకమైన సేవలతో ఈ విస్తరణ వేగవంతం చేయనున్నామని ప్రతినిధులు వివరించారు.


