సాక్షి, చైన్నె: చైన్నెలో మూడు చోట్ల న్యూరాలజిస్టుల ఆధ్వర్యంలో రీజినల్ ఎపిలెప్సీ(ఫిట్స్) సెంటర్లను కావేరి ఆస్పత్రి ఏర్పాటు చేసింది. న్యూరాలజిస్టు లు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, రిహాబిలిటేషన్ నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఈవిభాగంలో సేవలుఅందించనున్నది. ఒకే రకమైన వైద్య ప్రమాణాలు, ప్రమాణీకరించిన క్లినికల్ ప్రోటోకాల్స్తో ఫిట్స్ (ఎపిలెప్సీ) వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మూడు కేంద్రాల వైద్య బృందాలు ప్రతి పక్షం (రెండు వారాలకు ఒకసారి) వర్చువల్గా సమావేశమై, రోగుల ఆరోగ్య పరిస్థితి తీవ్రతను, సంక్లిష్టతలను సమిష్టిగా సమీక్షిస్తాయని న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ క్రిష్ శ్రీధర్ వివరించారు. ‘‘ఎపిలెప్సీ అనేది సంక్లిష్టమైన నరాల సమస్య. మందులు వాడినా ఫలితం లేనప్పుడు, మెదడులో ఏదైనా లోపం ఉందా లేదా సర్జరీ ద్వారా నయం చేయగల కారణం ఉందా అనేది గుర్తించడం ముఖ్యంగా వివరించారు. వివిధ విభాగాల నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చి రోగులను సమష్టిగా పరీక్షించడం వల్ల సరైన సమయంలో సర్జరీ అవసరమైన వారికి చికిత్స అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు అని తెలిపారు. ఆస్పత్రి కో– ఫౌండర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ఈ సమగ్ర రీజినల్ ఎపిలెప్సీ సెంటర్ ప్రారంభం ప్రాంతీయ వైద్య రంగంలో ఒక కీలక అడుగుగా పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు అర్హత ఉన్న రోగులకు, సర్జరీ పొందుతున్న వారి సంఖ్యకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే మా లక్ష్యంగా వివరించారు.. వ్యాధి నిర్ధారణ, మెడికల్ మేనేజ్మెంట్ నుండి సర్జరీ , పోస్ట్–ఆపరేటివ్ కేర్ వరకు అన్నీ ఒకే గొడుగు కిందకు తేవడం వల్ల రోగులకు సరైన సమయంలో సరైన వైద్యం అందుతుందన్నారు.


