సాక్షి, చైన్నె: దేవాదాయ శాఖలో కొత్తగా ఎంపికై న 80 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సచివాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేశారు. దేవాదాయ శాఖను మరింత పటిష్టం చేసేందుకు, వివిధ కోర్సులను పూర్తి చేసిన నిపుణులకు అర్చకులు, సహాయకులు, పరిపాలనా విభాగాధికారులుగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కాగా నియామక పత్రాలను అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ అన్ని కులాల వారికి అర్చకత్వ అవకాశం గురించిప్రస్తావిస్తూ, సామాజిక సమత, సమానత్వం సాధించే దిశగా శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరికీ ప్రాధాన్యత ఆధారంగా నియామకాలు పూర్తి చేసామన్నారు. ఆలయాల పవిత్రత , అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ఆలయాల పరిరక్షణ, భక్తులకు మౌలిక వసతుల కల్పనలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి రమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుమంగై ఆళ్వార్’ కాంస్య విగ్రహం పరిశీలన
తంజావూరు జిల్లా కుంభకోణంలోని శ్రీ సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుండి చోరీకి గురై, ఇంగ్లాండ్ నుండి విజయవంతంగా రప్పించిన అత్యంత పురాతన ’తిరుమంగై ఆళ్వార్’ కాంస్య విగ్రహాన్ని సీఎం విజయ్ సచివాలయంలో స్వయంగా పరిశీలించారు. కుంబకోణంలో చోరీకి గురైన ఈ విగ్రహాన్ని గుర్తించి ఇక్కడకు ఐడల్ వింగ్ తీసుకొచ్చింది. దీనిని సీఎంకు అందజేశారు. ఈ విగ్రహాన్ని సీఎం విజయ్ పరిశీలించి, ఐడల్ వింగ్ను అభినందించారు. ముందుగా సీఎం విజయ్ను సచివాలయంలో వీసీకే నేత, ఎంపీ తిరుమావలవన్, మంత్రి వన్నియరసులు మర్యాద పూర్వంగా భేటీ అయ్యారు.


