తిరువళ్లూరు: హిందూ ఆలయాల్లో దర్శన టోకెన్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ హిందూ మున్ననీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పెద్దకుప్పంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూ మున్ననీ జిల్లా అధ్యక్షుడు వినోధ్ఖన్నా అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా బీజేపీ గ్రామాల అభివృద్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ హిందూ దేవాయాల్లో దర్శనం కోసం డబ్బులు వసూలు చేసి టోకెన్లను మంజూరు చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దర్శనం కోసం టోకెన్లు మంజూరు చేసే విధానం లేదని 1967వ సంవత్సరంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే టోకెన్లను వసూలు చేయడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు. క్రిస్టియన్, ముస్లిం ఆలయాలకు లేని టోకెన్లు హిందూ దేవాలయాలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 1987వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖకు 5.25 లక్షల ఎకరాలు వున్నట్టు ప్రకటించారని అయితే 2019 నాటికి 4.78 లక్షలకు ఎకరాలకు ఎలా తగ్గిందన్నారు. దేవదాయశాఖకు చెందిన 1.23 లక్షల ఎకరాల భూమి, 22600 దుకాణాలు, 33627 స్థలాను అద్దెకు ఇచ్చారని గుర్తు చేశారు. అద్దెకు ఇచ్చిన స్థలం ద్వారా వచ్చే ఆధాయం ఎక్కుడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల ద్వారా ఏడాదికి వెయ్యి కోట్లు రూపాయల మేరకు ఆదాయం వస్తుందన్న ఆయన వీటిని ఉపయోగించి ఆలయాలను అబివృద్ది చేయవచ్చన్నారు. అనంతరం దర్శనంకు డబ్బులు వసూలు చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు హిందూ మున్ననీ నేతలు పాల్గొన్నారు.


