వేలూరు: మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ అడుగుజాడల్లో నడిచేందుకు ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలని వక్తలు తెలిపారు. రాష్ట్ర విద్యా దాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ 124వ జయంతిని పురస్కరించుకొని సీఎంసి ఆసుపత్రి వద్దనున్న కామరాజర్ విగ్రహానికి పలువురు నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు విద్యా అవకాశం కల్పించాలని ప్రతి పల్లెకు పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అదే విధంగా రాజకీయాల్లోను మచ్చలేని మనిషిగా పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. కాంగ్రెస్ పార్టీ వానిజ్య విభాగం రాష్ట్ర ఉపాద్యక్షులు ఎత్తిరాజులు అద్యక్షతన మాజీ కార్పొరేటర్లు చంద్ర ప్రకాష్, జయ ప్రకాష్లు కామరాజర్ విగ్రహానికి పూల మాల వేసి అన్నదానం చేసి స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వాహీద్బాషా, మాజీ అధ్యక్షులు టీకా రామన్, మాజీ ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కౌన్సిలర్లు కామరాజర్ విగ్రహానికి వేర్వేరుగా పూల మాల వేశారు. అదే విధంగా వేలూరు ఎమ్మెల్యే వినోద్ కన్నన్, టీవీకే పార్టీ జిల్లా కార్యదర్శి వేల్మురుగన్, గుడియాత్తం ఎమ్మెల్యే సిందులతో పాటు టీవీకే పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో కామరాజర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.


