– రాష్ట్ర విద్యార్థుల జపాన్ పర్యటన విజయవంతం
సాక్షి, చైన్నె : భారత్–జపాన్ దేశాల మధ్య విద్యా, సాంకేతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సంస్థ కేసీసీఎస్ ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన గ్రామీణ పాఠశాల విద్యార్థులు, మహిళా కళాశాల ప్రతినిధుల జపాన్ విద్యా పర్యటన విజయవంతమైంది. జపాన్ సైనన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ పూర్తి నిధులతో నిర్వహించిన ప్రతిష్టాత్మక సాకురా సైన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విద్యా మార్పిడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ పరిశోధక విద్యార్థుల కోసం జపాన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక లోటస్ లాంగ్టర్మ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ దరఖాస్తులను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గానూ మొత్తం 1,000 మంది భారతీయ విద్యార్థులకు జపాన్లో పరిశోధనలు చేసుకునేందుకు ఈ పూర్తి ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని గురువారం చైన్నెలో ప్రకటించారు. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 9 చివరి తేదీగా ప్రకటించారు. అంతర్జాతీయ వేదికపై గ్రామీణ విద్యార్థుల ఐటీ ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాకు చెందిన ఆక్సాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు టోక్యో సమీపంలోని తకాసాకి హైస్కూల్ను సందర్శించారు. కేసీసీఎస్ సమన్వయంతో సాగిన ఈ పర్యటనలో 10 మంది గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు పాల్గొన్నారు.వీరు జపాన్లో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై కేసీసీఎస్ వ్యవస్థాపకుడు కరుణానిధి కాశీనాథన్ మాట్లాడుతూ, గడిచిన 15 ఏళ్లుగా అంతర్జాతీయ అవకాశాలను, స్థానిక ప్రతిభను అనుసంధానించడమే లక్ష్యంగా ఇండో–జపాన్ భాగస్వామ్యం కోసంకృషి చేస్తున్నట్టు వివరించారు. భారత్–జపాన్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ.. ఈ ఏడాది జూన్ 5 నుండి కేసీసీఎస్ నాయకత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు.


