తమిళసినిమా: కథానాయకుడుగా తనకంటూ ప్రత్యేక బాటలో ప్రయాణిస్తున్న స్టార్ నటుడు అజిత్. ఈయన కథానాయకుడిగా తన పాపులారిటీని కాపాడుకుంటూనే తనకు అత్యంత ఫ్యాషనేట్ అయినా కారు రేస్ పోటీల్లో పాల్గొంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొని పలు పథకాలను గెలుచుకున్న అజిత్ ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకున్నారు. దీంతో ఆయన రక్షణ గురించి అభిమానులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈనేపథ్యంలో ఎట్టకేలకూ అజిత్ మంగళవారం సురక్షితంగా దుబాయ్ నుంచి చైన్నెకి చేరుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం గుడ్ బాడ్ అగ్లి తెరపైకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాలేదు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారన్నది చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో నటి శ్రీలీల నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ క్రేజీ చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా మే 1వ తేదీ నటుడు అజిత్ 55వ పుట్టినరోజు. దీంతో ఆయన అభిమానులు స్పెషల్ వార్త కోసం ఎదురు చూస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారికోసం ఓ ప్రత్యేక చిత్రం రెడీ అవుతోంది అన్నది తాజా సమాచారం. అజిత్ కార్ రేస్ పోటీల్లో పాల్గొన్న తరుణంలో ఒక డాక్యుమెంట్ చిత్రాన్ని దర్శకుడు ఎంఎల్ .విజయ్ చిత్రీకరించారు. దీన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ముందు థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని అజిత్ 55వ పుట్టినరోజు మే 1వ తేదీన థియేటర్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలబడే అవకాశం ఉంది.


