అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ఫలాలను అందించే దిశగా విస్తృత చర్యలు చేపట్టనున్నామని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. గురువారం సచివాలయం వేదికగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం వంటి కార్యక్రమాల్లోనూ విస్తృతం చేశారు.
సాక్షి, చైన్నె : సచివాలయంలో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉద్యోగాలకు ఎంపికై న వారికి సచివాలయంలో నియామక పత్రాలను అందజేయడంతో పాటూ కీలక ప్రాజెక్టులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై న 292 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు సీఎం నియామక పత్రాలను అందజేశారు. గత ఐదేళ్ల కాలంలో ఈ శాఖలో మొత్తం 3,297 ఖాళీలను భర్తీ చేసినట్లు ఈసందర్భంగా ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంవర్ధక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఎంపికై న 250 మంది స్పెషలిస్ట్ డాక్టర్లకు సీఎం స్టాలిన్ నియామక ఉత్తర్వులను అందించారు. ఇందులో ప్రసూతి , గైనకాలజీలో 182, రేడియాలజీ లో 37, ఫోరెన్సిక్ మెడిసిన్లో 24, జెరియాట్రిక్స్లో 6, కార్డియో–థొరాసిక్ సర్జరీ 1 పోస్టు ఉన్నాయి. గత ఐదేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 12,177 మంది సిబ్బందిని (వైద్యులు, ఫార్మసిస్ట్లు మొదలైనవారు) నియమించినట్టు సీఎం ప్రకటించారు.
ప్రాసిక్యూటర్ల నియామకం
న్యాయ శాఖలో భాగంగా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ విభాగంలో తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎంపికై న 45 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (గ్రేడ్–2) అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలను అందజేశారు. వీరు మేజిస్ట్రేట్ కోర్టులలో ప్రభుత్వ తరపున వాదనలు వినిపించడంతో పాటూ వివిధ శాఖలకు న్యాయ సలహాదారులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు అనితా రాఽధాకృష్ణన్, ఎం. సుబ్రమణియన్, కయల్వెజి సెల్వరాజ్, ఎం.పి. సామినాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం పాల్గొన్నారు.
మాజీ సైనికుల కోసం..
చైన్నె సమీపంలోని సెయింట్ థామస్ మౌంట్లో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మాజీ సైనికుల వసతి గృహం, శిక్షణా కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేశారు. 59,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 3 అంతస్తులతో నిర్మించే ఈ భవనంలో 80 గదులు, 216 బెడ్లు, జిమ్ సమావేశ హాల్ వంటి ఆధునిక వసతులు కల్పించనున్నారు. సుమారు 1.84 లక్షల మంది మాజీ సైనికులకు, ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి చైన్నె వచ్చే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అనంతరం మక్కల్ పనియిల్ మహత్తాన 5 ఆండుగల్’( ప్రజా సేవలో బృహత్తరకంగా ఐదేళ్లు ) పేరిట రూపకల్పన చేసిన సంచికను ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో కలైజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, పుదుమై పెన్ వంటి ప్రతిష్టాత్మక పథకాల వివరాలు, ప్రముఖుల వ్యాసాలు పొందుపరిచారు. ఈ సందర్భంగా సీఎం పేర్కొంటూ, అభివృద్ధి వికేంద్రీకరణ, పథకాల విస్తరణ, అందరికీ ఫలాలు దక్కే రీతిలో చర్యలు విస్తృతం చేయనున్నామని వ్యాఖ్యలు చేశారు.


