ఘనంగా అన్నావర్సిటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థ అన్నా విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవాన్ని ఘనంగా బుధవారం నిర్వహించారు. ఇందులో వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా శాఖ మంత్రి కోవి చెలియన్ బహిష్కరించగా, ఉన్నత విద్యా కార్యదర్శి శంకర్, ఇస్త్రో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ మైల్స్వామి అన్నాదురై హాజరయ్యారు. విజయం, సవాళ్ల గురించి ఈసందర్బంగా గవర్నర్ తన ప్రసంగంలో విద్యార్థులకు వివరించారు. విజయం అనేది కోరుకున్నది పొందడమే కాదని, దానిని ఉపయోగించుకోవడం కూడా అని వ్యాఖ్యలు చేశారు. భయం, కులం, మతం వంటి అడ్డంకులను అధిగమించడం అవసరమన్నారు. కాగా, ఈ వేడుక ద్వారా అన్నావర్సిటీ పరిధిలోని కళాశాలలోచదువులు పూర్తి చేసిన 1,50,495 మంది విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ఇందులో 881 మంది పీహెచ్డీ పొందారు. బంగారు పతకాలు ఐదుగురు దక్కించుకున్నారు. అలాగే ఇంజినీరింగ్, సైన్స్, కంప్యూటర్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ విభాగాల్లో వందకు పైగా విద్యార్థులు బంగారు పతకాలను సాధించారు.


