అఽధికార మార్పు తథ్యం
డీఎంకేకు కౌంట్ డౌన్ స్టార్ట్
మాఫియా గుప్పెట్లో తమిళనాడు
ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్
స్టాలిన్ను గద్దె దించుతామన్న
కూటమి నేతలు
ఒకే వేదికగా ఎన్డీఏ కూటమి నేతలు
తమిళనాడులో అధికార మార్పు తథ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీఎంకే పాలనకు కౌంట్డౌన్ ప్రారంభ
మైందన్నారు. మాదక ద్రవ్యాల మాఫియా గుప్పెట్లో ఉన్న తమిళనాడు, తమిళ
యువతను రక్షించి తీరుతామన్నారు.
స్టాలిన్ను గద్దె దించడం లక్ష్యంగా
సమష్టిగా పనిచేయనున్నామని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె: చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బీజేపీ నేతృత్వంలో బ్రహ్మాండ బహిరంగ సభ శుక్రవారం జరిగింది. ఈ సభ నిమిత్తం తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చైన్నెకి వచ్చారు. విమానాశ్రయంలో గవర్నర్ రవి, మంత్రి అన్బరసన్ ప్రధాని నరేంద్రమోదికి ఆహ్వానం పలికారు. ఇక్కడి హెలికాప్టర్లో బహిరంగ సభ వేదిక మధురాంతకంకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీఏ కూటమి పార్టీల నేతలందరూ చేతులు కలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కారదర్శి పళణిస్వామి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, పీఎంకే నేత అన్బుమణి రాందాసు, పుదియ నీది కట్చి నేత ఏసీ షణ్ముగంతో పాటు ఇతర కూటమి పార్టీల నేతలు జాన్పాండియన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అరవింద్ మీనన్, కో–ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్లతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్టాలిన్ను గద్దె దించుతాం
ఈ బహిరంగ సభలో పళనిస్వామి మాట్లాడుతూ ఒక్క కుటుంబం కోసం తమిళనాడులో 8 కోట్ల మంది ప్రజలు దోచుకోబడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న స్టాలిన్ కుటుంబానికి ఇక చరమ గీతం తథ్యమన్నారు. దినకరన్ మాట్లాడుతూ డీఎంకే పాలనకు కాలం చెల్లిందన్నారు. అన్నాడీఎంకేతో తమకు అభిప్రాయ బేధాలు ఉన్నా, అవన్నీ ఇప్పుడు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. తామంతా అమ్మ జయలలిత పెంచిన బిడ్డలమని, అందరం కలసి ఒక్కటిగా ముందుకెళ్తామన్నారు. తమ పై ఎలాంటి ఒత్తిడి లేదని, అమ్మ సుపరిపాలన మళ్లీ సాధించడం లక్ష్యంగా, ఒక కుటుంబం అవినీతి పాలనకు గద్దె దించే విధంగా సమష్టిగా పనిచేస్తామని ప్రకటించారు. తమ ఐక్యతకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణం అని వ్యాఖ్యానించారు. అన్బుమణి స్పందిస్తూ, పళణిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం తమిళనాట ఏర్పాటు కావడం తథ్యమని, స్టాలిన్కు మున్ముందు గడ్డుకాలమేనని హెచ్చరించారు. నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రాకతో సూర్యుడు అస్తమించాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో డీఎంకేను ఉదయ సూర్యుడి చిహ్నంను టార్గెట్ చేసి స్టాలిన్పై నైనార్ విరుచుకుపడ్డారు.
స్తంభించిన రహదారి
చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారి శుక్రవారం ఉదయం నుంచే స్తంభించింది. ప్రధాని నరేంద్రమోదీ జాతీయ రహదారి సమీపంలోని మధురాంతకంలో జరిగిన బహిరంగ సభకు రావడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రహదారిలో కంటైనర్లు, ఇతర భారీ వాహనాలు, లారీలను అనుమతించలేదు. దీంతో చైన్నె ఎక్స్ప్రెస్ వేట, బైపాస్ రోడ్డులు కిలోమీటర్ల కొద్ది వాహనాలతో బారులు తీరాయి. జాతీయ రహదారి వెంబడి అక్కడక్కడ వాహనాలు నిలుపుదల చేయడంతో రహదారి స్తంభించినట్లైంది. చెంగల్పట్టు నుంచి మధురాంతకం వైపు కేవలం బీజేపీ, అన్నాడీఎంకే, ఇతర కూటమి పార్టీల వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆ తర్వాత ట్రాఫిక్ను క్లియర్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
తమిళనాట సీఎంసీ పాలన
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తమిళనాడులో సీఎంసీ పాలన సాగుతోందన్నారు. సీ అంటే కరెప్షన్, ఎం అంటే మాఫియా, సీ అంటే క్రైం అంటూ ఈ సీఎంసీ పాలకుల నుంచి తమిళనాడును రక్షించేందుకు సన్నద్ధమయ్యామని వ్యాఖ్యానించారు. మత్తు అనే మాఫియా ఊబిలో తమిళనాడు యువతను ముంచేశారని, తన సోదరీమణులు, ఆడ బిడ్డలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు రాదా అనే ఆశతో తమిళనాడు మహిళా లోకం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులో అధికార మార్పు తథ్యమని, డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. తమిళనాడుకు తాము రూ.3లక్షల కోట్లు అందజేశామని గుర్తు చేస్తూ, వీటన్నింటిని దాచి పెట్టి అసత్యాలను స్టాలిన్ వళ్లిస్తున్నాడని ధ్వజమెత్తారు. తమిళనాడు అభివృద్ధి వెనక్కి వెళ్లిందని, ఈ అవినీతి పరుల నుంచి తమిళనాడు, తమిళ ప్రజలను, సంస్కృతిని పరిరక్షించే విధంగా ఎన్డీఏ కూటమి నేతలు సమష్టిగా ముందుకెళ్తారన్నారు. తిరుప్పరకుండ్రం వ్యవహారాన్ని డీఎంకే ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చేసిందని, ఇందులో హిందువులకు అనుకూలంగా బీజేపీ వెన్నంటి నిలబడిందన్నారు. తమిళనాడుకు డబుల్ ఇంజిన్ పాలన అవశ్యమని, ఆ దిశగా పయనం సాగుతుందని ప్రకటించారు. డీఎంకేను గద్దె దించుతామని, అవినీతి సొమ్మును కక్కిస్తామని స్పష్టం చేశారు.


